ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడు సయ్యద్ తౌషిక్ (11) మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లి మౌలాబీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
వీడియోలో మౌలాబీ వసతి గృహం నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి హాస్టల్ నిర్వాహకులే కారణమని ఆమె పేర్కొన్నారు. కుమారుడి మరణంపై న్యాయం చేయాలని తాను ఆందోళన చేస్తున్న సమయంలో తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎదురైన అవమానాలు, బాధలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వీడియోలో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరే బిడ్డకు, మరే తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆమె కోరారు. తన కుమారుడిని ఎక్కడ సమాధి చేశారో, అదే ప్రదేశంలో తనను కూడా పూడ్చిపెట్టాలని వీడియోలో మౌలాబీ విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మౌలాబీ చేసిన ఆరోపణలపై అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.
also read: తెలుగులోకి ‘హనుమాన్ అన్ష్’… త్రివిక్రమ్ సమర్పణలో ఈ నెల 18న విడుదల
