నెల్లూరు– తిరుపతి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సంచలనం రేపిన టీడీపీ కార్యకర్త బాలయ్య హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. కేసును విచారించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సత్యనారాయణరెడ్డిని భద్రత మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
పెళ్లకూరు మండలం చిల్లకూరు పరిధిలోని కాల్వలు, ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణకు సంబంధించి సత్యనారాయణరెడ్డిపై గతంలో స్థానిక టీడీపీ నాయకులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
ఆక్రమిత ప్రాంతం మీదుగా తన వ్యవసాయ భూమికి రహదారి ఏర్పాటు చేసుకునేందుకు సత్యనారాయణరెడ్డి ప్రయత్నించగా.. టీడీపీ కార్యకర్త బాలయ్యతో పాటు మరికొందరు దీనిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితి ఘర్షణకు దారితీయడంతో సత్యనారాయణరెడ్డి అనుచరులతో కలిసి టీడీపీ నాయకులపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడిలో బాలయ్య ఛాతీపై బలంగా దాడి జరగడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణరెడ్డిని ఏ1 నిందితుడిగా చేర్చారు. అరెస్టు తప్పించుకునేందుకు కొంతకాలం ప్రయత్నించిన ఆయన.. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి లొంగిపోయారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు.
also read: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
