హైదరాబాద్లో ఆహార భద్రతపై అధికారులు మరోసారి దృష్టి సారించారు. నగరవ్యాప్తంగా బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొత్తం 9 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 19 కేఫ్లు, హోటళ్లలో తనిఖీలు చేపట్టాయి.
ఈ తనిఖీల్లో పలు చోట్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఈగలు, బొద్దింకల బెడద వంటి సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. ఆహార తయారీ, నిల్వ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకున్నారు.
మదీనాలోని షాదాబ్ హోటల్కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన డ్రీమ్జ్ కెఫెటీరియా, ఏషియాటిక్ కేఫ్లను మూసివేశారు.
కల్తీ లేదా నాణ్యతపై అనుమానాలు ఉన్న ఆహార పదార్థాల నుంచి మొత్తం 15 నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇక ఆహార భద్రత నిబంధనలు పాటించని మరికొన్ని కేఫ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
also read: మనస్థాపంతో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య…!
