సరదాగా చేసిన ఓ ప్రాంక్ మెసేజ్ ముగ్గురు యువకులను పోలీసుల చేతికి చిక్కేలా చేసింది. ప్రియురాలిని ఆటపట్టించేందుకు ‘నన్ను కిడ్నాప్ చేశారు’ అంటూ పంపిన సందేశం చివరకు వారి ఫ్లాట్లో దాచిన భారీ నగదును బయటపెట్టింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి ప్రాంతానికి చెందిన దేశినేని సుమంత్, మాకాటి మనోజ్, కనుమూరి గౌతమ్ కేపీహెచ్బీలోని ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్లో కలిసి ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ముగ్గురూ పార్టీ చేసుకుని మద్యం సేవించారు. ఆ సమయంలో సుమంత్ తన ప్రియురాలికి సరదాగా ‘నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు’ అంటూ మెసేజ్ పంపించాడు.
ఈ సందేశాన్ని నిజమేనని భావించిన యువతి తీవ్ర ఆందోళనకు గురై వెంటనే డయల్ 112కు సమాచారం అందించింది. దీంతో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలోని పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే యువకులు ఉంటున్న ఫ్లాట్కు చేరుకున్నారు. అక్కడ సుమంత్ సురక్షితంగా ఉండటంతో కిడ్నాప్ వ్యవహారం అంతా ప్రాంక్ అని పోలీసులు గుర్తించారు.
అయితే యువకుల ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఫ్లాట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ సూట్కేస్లో దాచిన సుమారు రూ.30 లక్షల నగదు బయటపడింది. నగదుకు సంబంధించి యువకులు ఇచ్చిన సమాధానాలు పోలీసులకు అనుమానాస్పదంగా అనిపించినట్లు సమాచారం.
దీంతో పోలీసులు వారి మొబైల్ ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్కు సంబంధించిన వ్యవహారాలపై ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్గా, గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సుమంత్కు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇలా సరదాగా పంపిన ఓ మెసేజ్.. అసలు కథను బయటపెట్టింది. కిడ్నాప్ డ్రామాగా మొదలైన వ్యవహారం చివరకు బెట్టింగ్ నగదు పట్టుబడటంతో ముగిసింది.
also read: పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్పై UIDAI కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30లోపు ఈ పని పూర్తి చేయండి!
