టాలీవుడ్లో క్రేజీ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఓ ఫ్యామిలీ ఫొటోకు రష్మిక చేసిన సరదా కామెంట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.
వర్షాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సమయం గడిపాడు విజయ్ దేవరకొండ. తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చిన్నతనంలో తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో మధ్యాహ్నం నిద్రించే అవకాశం మళ్లీ దొరికిందంటూ తన అనుభూతిని క్యాప్షన్లో వెల్లడించాడు.
ఈ ఫొటోను రష్మిక మందన్న తీసిందని పేర్కొంటూ విజయ్ ఆమెకు ఫొటో క్రెడిట్ కూడా ఇచ్చాడు. దీంతో రష్మిక వెంటనే స్పందించి విజయ్ను సరదాగా ఆటపట్టించింది. తనను చూసినప్పుడు కనిపించే అమాయకపు చూపులను తట్టుకోలేకే ఫొటో క్రెడిట్ ఇచ్చావా అంటూ చమత్కరించింది. అంతేకాదు, గతంలో తాను తీసిన ఇతర ఫొటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని కోరుతూ తన ఫొటోగ్రఫీ టాలెంట్ను సరదాగా ప్రస్తావించింది.
విజయ్, రష్మిక కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి భారీగా అభిమానులు ఉన్నారు. తాజాగా వీరిద్దరి సోషల్ మీడియా సరదా సంభాషణ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది.
also read: “ తమ్ముడి పలకరింపు చాలు!”- బ్రహ్మానందం సోదరుడి భావోద్వేగ వ్యాఖ్యలు..
