ధాన్యం కుంభకోణం ఆరోపణలపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్కు చెందిన ఏఆర్ఎస్ రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన భారీ మొత్తంలో ధాన్యం లెక్కల్లో కనిపించలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులో అందుబాటులో లేకుండా పోయినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో సక్రమంగా నమోదు చేయకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 165/2026 కింద రేఖా నాయక్పై కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధాన్యం ఎక్కడికి తరలించారనే అంశంతో పాటు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
