క్రైమ్ మిర్రర్ : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో పలుమార్లు సమన్లు అందినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తులసి మాలలపై మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఇదే వ్యవహారానికి సంబంధించి భారత సైన్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ కేసు విచారణలో భాగంగా మహువా మొయిత్రా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. బుధవారం విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ ఆమె గైర్హాజరయ్యారు. మహువా తరఫు న్యాయవాది కూడా ఆమె కోర్టుకు రాలేరని న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాలను పదేపదే పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. కోర్టు పట్ల గౌరవం లేని విధంగా ఆమె వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ఇదే కేసులో తనను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. కోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read : ఐఫోన్, ఖరీదైన బైక్ల కోసం తాతనే హత్య.. 13 ఏళ్ల బాలికపై సంచలన ఆరోపణలు
