పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తారాపీఠ్లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భక్తులు నిద్రలో ఉన్న సమయంలో హోటల్ మొదటి అంతస్తులోని రిసెప్షన్ ప్రాంతంలో ఉన్న ఏసీ యూనిట్ వద్ద మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పలువురు భక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఫైర్ అలారం పనిచేయకపోవడం కూడా ఆందోళన కలిగించింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని రాంపూర్హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? ఫైర్ అలారం ఎందుకు పనిచేయలేదు? షార్ట్ సర్క్యూట్కు కారణాలేంటి? అనే అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కర్ణాటకకు స్పష్టమైన సూచనలు
