గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కారు. కొంతకాలంగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, సాంకేతిక ఆధారాల సహాయంతో ఆయన ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇటీవల చోటుచేసుకున్న కిడ్నాప్ ఘటనలో ముస్తఫా పేరు బయటకు రావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. పొగాకు లోడ్తో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు ఇద్దరిని బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి కిడ్నాప్కు గురైన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణలో ముస్తఫా పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో, ఆయనపై కూడా కిడ్నాప్, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
చివరకు గుజరాత్లో ఆయన ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని ముస్తఫాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
also read: నిమ్స్లో చికిత్స పొందుతున్న యువతిపై అసభ్య ప్రవర్తన
