క్రైమ్ మిర్రర్ : కష్టపడి చదివి ఐఏఎస్ అధికారి కావాలని, కలెక్టర్గా ప్రజలకు సేవ చేయాలని కలలు కన్న ఓ యువతి జీవితం అనుకోని ప్రమాదంతో అర్థాంతరంగా ముగిసింది. ఇప్పటికే భార్యను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఓ తండ్రికి, జీవితానికి ఆధారంగా నిలిచిన ఏకైక కుమార్తె కూడా దూరం కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కూతురు మృతదేహాన్ని చూసి తండ్రి విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన (20) అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చదువులో ప్రతిభ కనబరుస్తూ, భవిష్యత్తులో సివిల్స్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్రా నది సమీపానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో సాయినాథ్ రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. సుమారు పదేళ్ల క్రితం ఆయన భార్య మంజుల అనారోగ్యంతో మరణించగా, అప్పటి నుంచి తన ఏకైక కుమార్తెనే జీవితానికి ఆశగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా దూరం కావడంతో ఆయన పూర్తిగా ఒంటరివారయ్యారు. “ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానని చెప్పావు కదా తల్లి… ఇలా నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయావా?” అంటూ తండ్రి రోదించిన మాటలు అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. చేతన మృతితో ఆమె స్వగ్రామమైన కడప జిల్లా పెద్దముడియం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు.
also read : సంగారెడ్డి జిల్లా ఇరక్పల్లిలో దారుణం.. భార్యను చంపి లొంగిపోయిన భర్త
