క్రైం మిర్రర్ : భద్రాచలం పట్టణంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన మహిళా సర్పంచ్ మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన సర్పంచ్ వెంకటరమణ అనారోగ్య కారణాలతో చికిత్స కోసం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స సమయంలో వైద్యులు సరైన శ్రద్ధ చూపలేదని, నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సర్పంచ్ మృతి విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మృతదేహాన్ని ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం నుంచి సరైన వివరణ రాకపోవడం, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వైద్యులు ముందుకు రాకపోవడం తమ ఆవేదనను మరింత పెంచిందని వారు తెలిపారు.
ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు తమను మరింత బాధించిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుడు స్వయంగా బయటకు వచ్చి పరిస్థితిపై వివరణ ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మృతురాలి భర్త ఆగ్రహంతో ఆస్పత్రి లోపలికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఘటనపై పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
read also : పెంపుడు గేదె దాడిలో వ్యక్తి మృతి.. రాజేంద్రనగర్లో విషాదం
