భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించారు. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో ఈ పర్యావరణహిత రైలు సేవలు అందించనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ, స్వచ్ఛమైన ఇంధన వినియోగం లక్ష్యంగా భారత రైల్వే చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను ఆయన ప్రశంసించారు. దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు, ఆధునిక రైల్వే రంగంలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు.
ఈ హైడ్రోజన్ రైలు సాధారణ డీజిల్ లేదా బొగ్గు ఆధారిత వ్యవస్థపై ఆధారపడదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలును నడుపుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీంతో ప్రయాణ సమయంలో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.
‘నమో గ్రీన్ రైలు’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ రైలులో 10 కోచ్లు ఉన్నాయి. ఇందులో 3200 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. గంటకు సుమారు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో దాదాపు 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ రైలును తయారు చేసింది. హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతను వినియోగిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.
ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలు జర్మనీలో ప్రారంభమైంది. అనంతరం జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. ఇప్పుడు భారత్ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మరో ముఖ్యమైన అడుగు వేసింది.
also read: జైలు గోడల మధ్య చిగురించిన ప్రేమ.. జీవిత ఖైదీల పెళ్లికి హైకోర్టు అనుమతి