Homeజాతీయంమహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం.. డిటర్జెంట్, రసాయనాలతో కోట్ల లీటర్ల సింథటిక్ పాలు!

మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం.. డిటర్జెంట్, రసాయనాలతో కోట్ల లీటర్ల సింథటిక్ పాలు!

మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన భారీ పాల కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. పాలలో డిటర్జెంట్, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలు కలిపి కృత్రిమ పాలను తయారు చేసి విక్రయించిన ఘటన బయటపడింది. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (FDA) అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. నిందితులు అసలు పాల మాదిరిగానే కనిపించేలా సింథటిక్ పాలను తయారు చేసి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించగా.. భారీ స్థాయిలో నకిలీ పాల ఉత్పత్తి జరిగినట్లు వెల్లడైంది. సుమారు 2.3 లక్షల కిలోలకు పైగా నాసిరకం పాలపొడితో 23 లక్షల లీటర్లకు పైగా కృత్రిమ పాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.9 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

అధికారుల అనుమానాల ప్రకారం.. గత ఆరు నెలల కాలంలో భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వివిధ ప్రాంతాలకు చేరి ఉండొచ్చని భావిస్తున్నారు. స్వచ్ఛమైన పాలలో కొంత శాతం సింథటిక్ పాలను కలిపి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది.

పాల రంగంలో నాణ్యతను పెంచినట్లు చూపించేందుకు నిందితులు డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ పదార్థాలు పాల రూపాన్ని, చిక్కదనాన్ని మార్చి వినియోగదారులను మోసం చేసేలా ఉపయోగించినట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత కూడా నిందితులు పరారీలో ఉండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

ఆరోగ్యానికి తీవ్ర ముప్పు
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా తీసుకునే పాలలో ఇలాంటి విషపూరిత పదార్థాలు కలపడం తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ పాలను దీర్ఘకాలం తీసుకుంటే జీర్ణవ్యవస్థతో పాటు కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

మహారాష్ట్రలో బయటపడిన ఈ ఘటనతో ఇతర ప్రాంతాల్లోనూ పాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టి కల్తీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

also read: Navi Mumbai Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసీ…11 నెలల తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు