హైదరాబాద్ నగర పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జల్పల్లి బాలాజీనగర్లో ఉన్న ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.
ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించిన ఈ పరిశ్రమలో ముడిసరుకు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే విస్తరించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన నల్ల పొగలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు సమీపంలోని ఇళ్లకు, దుకాణాలకు వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ లోపం (షార్ట్ సర్క్యూట్) కారణమా? లేక ఇతర కారణాల వల్లా మంటలు చెలరేగాయా? అన్న దానిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
also read: 15 ఏళ్లకే టీమిండియాలో చోటు.. జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్!