- నేటి నుంచి 30 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా
- నాణ్యమైన విత్తనాల విక్రయం
- రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి ప్రతినిధి : రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, పంటల దిగుబడిని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలలో విత్తన మేళాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలోని రైతు వేదికల్లో జూన్ 23 నుండి జూన్ 30 వరకు విత్తన మేళా నిర్వహించనున్నట్లు పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విత్తన మేళాలో వివిధ రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా వరి, కంది, పెసర, సోయాబీన్, పత్తి, కూరగాయల విత్తనాలతో పాటు పంటల సంరక్షణకు అవసరమైన ఉత్పత్తులను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు.
రైతులు నేరుగా రైతు వేదికలకు వచ్చి తమ అవసరాలకు అనుగుణంగా విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. వ్యవసాయ నిపుణులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, ఎరువుల నిర్వహణ, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించనున్నారు. నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను పొందడంతో పాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు కోరారు.