మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఓ యువతి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టవడం సంచలనంగా మారింది. కేరళకు చెందిన హర్ష సన్నీ (28), అందాల పోటీల్లో పాల్గొని గుర్తింపు పొందింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కింది.
12 ప్యాకెట్లలో డ్రగ్స్ తరలింపు
హర్ష సన్నీ బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో లగేజీ తనిఖీ సమయంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు ఆమెను ప్రత్యేకంగా పరిశీలించారు. తర్వాత ఆమె దగ్గర ఉన్న ట్రావెల్ బ్యాగ్ను పూర్తిగా తనిఖీ చేయగా అందులో 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు కనిపించాయి. వాటిలో ఉన్న పచ్చటి పదార్థంపై అనుమానం రావడంతో అధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఎన్డీపీఎస్ కిట్తో చేసిన ప్రాథమిక పరీక్షల్లో అది హైడ్రోపోనిక్ మారిజువానా అని తేలింది.
11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి గుర్తింపు
హైడ్రోపోనిక్ గంజాయి సాధారణ గంజాయితో పోలిస్తే చాలా ఖరీదైనది. దీనిని నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక పద్ధతులతో పెంచుతారు. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండటంతో ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తం బరువు సుమారు 11 కిలోలు. దీని విలువ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.11.82 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఇంత భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు పట్టుబడటంతో అధికారులు కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి హర్ష సన్నీని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్ వర్క్ పై దర్యాప్తు కొనసాగుతోంది.