-
రాజ్యసభ పదవుల విషయంలో మొండి చేయి
-
ఆవేదనలో నేతలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ పదవుల విషయంలో బిజెపికి కనీస ప్రాతినిధ్యం లేదు. నాలుగు పదవులకు గాను టిడిపి మూడు, జనసేనకు ఒక పదవి కేటాయిస్తూ ఒప్పందం జరిగింది. కానీ ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. గతంలో రెండు సార్లు రాజ్యసభ పదవులు భర్తీ చేస్తే.. రెండు పదవులు తీసుకుంది బిజెపి.
ఈసారి పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో రాజ్యసభ పదవి ఇవ్వలేమని చంద్రబాబు ముందే తేల్చేశారు. పెద్దలు పట్టుబడతారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. దీంతో ఏపీలోని బిజెపి సీనియర్ నేతలు ఆవేదనతో ఉన్నారు. చాలామంది రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రకరకాలుగా ప్రచారం కూడా నడిచింది.
కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు..
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే అప్పట్లో పోటీ చేసినప్పుడే కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ పదవి ఆఫర్ ఉండేది.
అయితే ఇప్పుడు నలుగురు భర్తీ జరుగుతుంటే.. బిజెపికి ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం చిక్కలేదు. ఒక విధంగా ఇది ఏపీ బీజేపీకి షాకింగ్ పరిణామమే. కానీ పెద్దలు ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో మౌనంగా ఉన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.
ఆ ఒప్పందం ప్రకారం..
టిడిపి తో కూటమి కట్టిన సమయంలోనే రాజ్యసభ పదవుల విషయంలో బిజెపికి సింహప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ పదవులు విషయంలో టిడిపి తో పాటు జనసేనకు.. రాజ్యసభ పదవులు విషయంలో బిజెపికి ప్రాధాన్యం కల్పించాలన్నది మూడు పార్టీల మధ్య ఒప్పందం.
ఆ ఒప్పందం ప్రకారమే తొలి రెండుసార్లు రాజ్యసభ పదవులు ఎంపిక సమయంలో బిజెపికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం బిజెపికి ముందు చేయి చూస్తారు. పార్టీలో ఇది తీరని అసంతృప్తికి కారణం అవుతోంది. బిజెపి హై కమాండ్ కు సైతం దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నట్లు తెలుస్తోంది.