-
రాజ్యసభ పదవి లేనట్టే
-
కర్ణాటక నుంచి ముగ్గురు అభ్యర్థులతో జాబితా విడుదల
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు షాక్ తగిలింది. రాజ్యసభ పదవి విషయంలో హై కమాండ్ మొండి చేయి చూపింది. గత కొద్ది రోజులుగా షర్మిలకు రాజ్యసభ పదవి దక్కడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ హై కమాండ్ వెనక్కి తగ్గింది. కర్ణాటక కోటాలో షర్మిల కు ఛాన్స్ లేదని తేల్చేసింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు షర్మిల. ఆమె అనుచరులు సైతం బాధపడుతున్నారు. హై కమాండ్ తీరును తప్పుపడుతున్నారు.
మూడు పదవులు భర్తీ..
కర్ణాటకలో మూడు రాజ్యసభ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. అందులో ఒక పదవి షర్మిలకు ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడిచింది. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షర్మిలను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు.
దీంతో తెగ ఆనందంతో మురిసిపోయారు షర్మిల. కానీ ఆ ఆనందం కొద్దిరోజులు మాత్రమే నిలిచింది. కర్ణాటక నుంచి ముగ్గురు నేతలను రాజ్యసభకు ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో షర్మిలకు చోటు దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు షర్మిల.
అప్పట్లో హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. సుదీర్ఘకాలం పాదయాత్ర కూడా చేశారు ఆ రాష్ట్రంలో. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి ఏపీ పగ్గాలు అందుకున్నారు. అలా చేసినందుకుగాను రాజ్యసభ పదవి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చారు.
ఇప్పుడు కర్ణాటక రూపంలో ఆ అవకాశం వచ్చింది. కానీ జాతీయ అవసరాల మేరకు ఆ పార్టీ మీడియా చైర్మన్గా వ్యవహరిస్తున్న పవన్ ఖేరా వైపు మొగ్గుచూపింది కాంగ్రెస్ హై కమాండ్. దీంతో షర్మిల కు అవకాశం లేకుండా పోయింది. రానున్న మూడేళ్ల కాలంలో తప్పకుండా రాజ్యసభ పదవి ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నేతలు షర్మిలకు బుజ్జగించినట్లు తెలుస్తోంది.