హైదరాబాద్, క్రైమ్మిర్రర్: టాలీవుడ్ హీరో గోపీచంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత వర్ష: సాగా ఆఫ్ శూల చిత్రంలో నటిస్తున్న ఆయన.. అదే సమయంలో మరో కొత్త సినిమాను కూడా ప్రారంభించి అభిమానుల్లో ఆసక్తి పెంచేశారు. గోపీచంద్ 34గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
ఈ సినిమాతో ప్రముఖ స్టంట్ మాస్టర్ వీ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారడంతో మూవీ లవర్స్ దృష్టి ఈ ప్రాజెక్ట్పై పడింది. మే నెలలో గ్రాండ్గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు మొదలైంది.
ఈ చిత్రంలో గోపీచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా నటిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాత్ర, ఆనందో బ్రహ్మ వంటి విజయవంతమైన సినిమాలను అందించిన ఈ బ్యానర్ నుంచి వస్తున్న మరో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి.
సంగీత దర్శకుడిగా శ్యామ్ సీఎస్ పనిచేస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ను రామకృష్ణ-మౌనిక చూస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. మండుతున్న ఆకాశం మధ్య కొండపై గంభీరంగా నిలబడి ఉన్న బ్లాక్ పాంథర్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోస్టర్ను బట్టి చూస్తే ఇది ఇంటెన్స్ మైథికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్లతో గోపీచంద్ బిజీగా ఉండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. గోపీచంద్ 34 నుంచి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.