క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల్లోనే చాలామంది ఇలా తప్పుకొని తమ వారసులకు అవకాశం కల్పించారు. అయితే 2029 ఎన్నికల్లో మరికొంతమంది రాజకీయాలనుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అయ్యన్నపాత్రుడు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తన తర్వాత తన కుటుంబ సభ్యులకు టిడిపిలో సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి తన పొలిటికల్ రిటైర్మెంట్ ఖాయం అని తేల్చి చెప్పారు.
టిడిపి ఆవిర్భావం నుంచి…
నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు అయ్యన్నపాత్రుడు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తొలి ప్రయత్నం లోనే మంత్రి అయిన టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి క్యాబినెట్లో చోటు దక్కించుకుంటూ వచ్చారు. సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే ఆయన ఓటమి చవిచూసారు. తొలిసారిగా 2004లో ఓడిపోయారు. 2019లో ఓటమి చవి చూశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అవుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో మాత్రం గెలిచేసరికి స్పీకర్ గా అవకాశం కల్పించారు చంద్రబాబు. మధ్యలో 1998 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుకు అత్యంత విధేయుడు అయిన నేతగా ఎదిగారు అయ్యన్నపాత్రుడు.
వయోభారంతో…
ఏడు పదుల వయసు దాటిన అయ్యన్నపాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో ఆయన తప్పుకుని కుమారుడు విజయ్ కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ పార్టీ అవసరాల దృష్ట్యా పోటీ చేయమని చంద్రబాబు కోరేసరికి అయ్యన్నపాత్రుడు కాదనలేకపోయారు. ఇప్పటికే అయ్యన్న కుమారుడు విజయ్ టిడిపిలో యాక్టివ్ గా ఉన్నారు. అందుకే ఈసారి తాను తప్పుకొని కుమారుడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అయ్యన్నపాత్రుడు. మరోవైపు రాజ్యసభకు కూడా చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో తన కుటుంబానికి టిడిపికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చెప్పడం చూస్తుంటే మాత్రం.. కొత్త చర్చలకు దారితీస్తోంది.