Homeఅంతర్జాతీయంUS-Iran Deal: హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన.. కౌంటర్ ఇచ్చిన ఇరాన్!

US-Iran Deal: హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన.. కౌంటర్ ఇచ్చిన ఇరాన్!

ఇరాన్‌–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న దిబ్బంధనాన్ని త్వరలో ఎత్తివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అలాగే ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలను కూడా వెనక్కి పిలిపించనున్నట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ట్రూత్‌ సోషల్‌ వేదికగా చేసిన వ్యాఖ్యల్లో ట్రంప్‌ మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 11 నెలల క్రితం ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా బీ-2 బాంబర్లతో దాడి చేసినప్పుడు అక్కడ శుద్ధి చేసిన యురేనియం నిల్వలు మిగిలిపోయాయని చెప్పారు. ఆ యురేనియాన్ని వెలికితీయగల సాంకేతిక సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, చైనా దేశాలకు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.

మా షరతులకు ఓకే అంటేనే జలసంధి తెరుచుకుంటుంది!

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ వెంటనే స్పందించింది. హోర్ముజ్‌ జలసంధి విషయంలో తమ షరతులు నెరవేరినప్పుడే పూర్తి స్థాయిలో మార్గం తెరవబడుతుందని స్పష్టం చేసింది. ట్రంప్‌ చేసిన ప్రకటనల్లో కొంత నిజం ఉన్నప్పటికీ, అనేక విషయాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్‌ విమర్శించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఇంకా కొన్ని అంశాలపై విభేదాలు కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

వాషింగ్టన్‌ తో పాకిస్థాన్ లాబీయింగ్  

ఇదిలా ఉండగా, అమెరికాలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్‌ కీలక అడుగు వేసినట్లు సమాచారం. వాషింగ్టన్‌కు చెందిన ఇర్విన్‌ గ్రేవ్స్‌ స్ట్రాటజీ గ్రూప్‌ అనే లాబీయింగ్‌ సంస్థతో పాకిస్థాన్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఒప్పందం విలువ సుమారు 1.2 మిలియన్‌ డాలర్లు కాగా, నెలకు 50 వేల డాలర్ల చొప్పున రెండేళ్ల పాటు చెల్లించేలా పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం అంగీకరించినట్లు తెలుస్తోంది.

అమెరికా ప్రభుత్వ వర్గాల్లో తమకు అనుకూల వాతావరణం కల్పించుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఒకవైపు అమెరికా–ఇరాన్‌ చర్చలు, మరోవైపు పాకిస్థాన్‌ లాబీయింగ్‌ ప్రయత్నాలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు