హైదరాబాద్, క్రైమ్మిర్రర్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోరుకుని ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడినంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజమండ్రిలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సోమవారం సాయంత్రం మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అన్నీ పొగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండే రాజకీయాల్లోకి వచ్చినట్టు వెల్లడించారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఉద్ధేశించి ఈ సందర్భంగా కీలక కామెంట్లు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తామూ ఎదురుదాడి చేస్తామన్నారు.తనను విమర్శించే వాళ్లు ముందుకు వస్తారా.? అని నిలదీశారు.
ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పాలని, తాను సిద్ధమన్న పవన్ కల్యాణ్.. చాయిస్ మీకే ఇస్తున్నానని, తనను రెచ్చగొట్టవద్దన్నారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ను జైలుకు పంపాలని తాను కోరుకున్నట్టు విశ్లేషకుడు చెప్పడంలో ఉన్న లాజిక్ తనకు అర్థం కాలేదన్న ఆయన.. జగన్ జైలుకు వెళితే తనకు లాభం చేకూరుతుందనడం పిచ్చి లాజిక్గా అభివర్ణించారు. తాను సీఎం కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు ప్రయత్నిస్తే అయ్యేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది తన సిద్ధాంతం కాదన్న పవన్.. శత్రువుగా బలంగా ఉన్నప్పుడేతాను కొడతానని, బలహీనంగా ఉన్నప్పుడు కొట్టనని స్పష్టం చేశారు.
చేతులు కట్టుకుని కూర్చోనంటూ వార్నింగ్…
కులం కార్డు పట్టుకొస్తామంటే ఎలా అని, ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా.? అంటూ ప్రశ్నించారు. నాకు కోపం రాదా.? అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాయని, వాటికి ధీటుగా ఎదురుదాడి చేస్తామని స్పష్టం చేశారు. మితిమీరిన సహనం చేతగానితనమవుతుందని, మౌనంగా ఉన్నావంటే మెత్తగా ఉన్నావని కాదని, గట్టిపడుతున్నామని అర్థమన్నారు. సరైన సమయం కోసం చూస్తున్నానన్న పవన్ కల్యాణ్.. అది బలహీతన కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన మరిన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ నడపాలంటే క్రమశిక్షణ ఉండడంతోపాటు కేడర్ కూడా క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే కూటమిలో బలం స్తుందన్నారు.జనసేన నేతలు పదవులు ఇస్తే ఉత్సాహంగా పని చేస్తారనుకుంటే మాట్లాడడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వగానే పెద్ద మనుషులు అయ్యారన్న ఆయన.. పదువుల కోసమే జనసేనలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోరాటం జనసేనమూల లక్షణమని, కూటమి కోసం కొన్ని సార్లు సర్ధుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మౌనం ఒక పార్టీ కోసం కాదని, ఐదు కోట్ల ప్రజల కోసమని స్పష్టం చేశారు.