హైదరాబాద్, క్రైమ్మిర్రర్: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా పెట్రోల్ లీటర్పై 94 పైసలు, డీజిల్ లీటర్పై 96 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఈ ప్రభావం నేరుగా దేశీయ ఇంధన ధరలపై పడుతోంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.3 చొప్పున పెంచారు. ఆ తర్వాత మే 19న మరోసారి దాదాపు 90 పైసల వరకు ధరలు పెరిగాయి. తాజాగా మూడోసారి కూడా ధరలు పెరగడంతో ఈ నెలలో మొత్తం పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.5 వరకు పెరిగినట్లైంది.తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కు చేరగా, డీజిల్ ధర రూ.100.94కు పెరిగింది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇంధన ధరలు పెరిగాయి. పెరుగుతున్న ధరలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక సీఎన్జీ వినియోగదారులకు కూడా షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం కిలో సీఎన్జీపై మరో రూ.1 పెంచుతున్నట్లు ప్రకటించింది. కేవలం 10 రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనించదగ్గ విషయం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సామాన్యులపై భారం మరింత పెరిగే అవకాశముంది.