హైదరాబాద్,క్రైమ్మిర్రర్: నగరంలో కిడ్నాప్ గ్యాంగ్ల బెడదతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. తాజాగా నగరంలో కిడ్నాప్ గ్యాంగ్ హల్చల్ చేసి పంజాగుట్టలోని ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తాము రూ.2.75 లక్షలతో కొనుగోలు చేసిన నెక్లెస్లో నకిలీ రాళ్లు ఉన్నాయంటూ ఆ వ్యాపారిపై సదరు గ్యాంగ్ దాడి చేసింది. అనంతరం ఆ బంగారు వ్యాపారిని బెదిరించి రూ. 4 లక్షల నగదును తమ ఖాతాలోకి ఈ గ్యాంగ్ బదిలీ చేయించుకుంది.
అనంతరం ఏటీఎం వద్దకు తీసుకెళ్లి.. మరో రూ. లక్షను అతడి ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయించిందీ గ్యాంగ్. ఆ తర్వాత బంగారు వ్యాపారిని ఇంటికి తీసుకెళ్లి.. అతడి కుటుంబ సభ్యులను బెదిరించింది. వ్యాపారి భార్య నుంచి భారీగా నగలను ఈ కిడ్నాప్ గ్యాంగ్ తీసుకుంది. దాంతో వ్యాపారి భార్య స్పృహ తప్పి పడిపోయింది. అక్కడి నుంచి కిడ్నాప్ గ్యాంగ్ పరారైంది.
దాంతో పంజాగుట్ట పోలీసులను బంగారు వ్యాపారి కుటుంబం ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు వ్యాపారి నివాసం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అలాగే వ్యాపారి షాపుతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరో వైపు.. అత్తాపూర్లో మహిళను కొందరు కిడ్నాప్ చేశారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.