-
సంచలన నిర్ణయాలు దిశగా కొత్త ప్రభుత్వం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బెంగాల్లో మమతకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. మమతా బెనర్జీ హయాంలో అమలు చేసిన మతపరమైన పథకాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మమత బెనర్జీ టీం ఆత్మరక్షణలో పడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలుకు సైతం సిద్ధమవుతోంది. సోమవారం రెండోసారి క్యాబినెట్ సమావేశం జరిగింది. జూన్ 1 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు.
అన్నపూర్ణ పథకం అమలు…
ప్రధానంగా అన్నపూర్ణ పథకం అమలు చేసేందుకు బిజెపి కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన మహిళలకు ఈ పథకం కింద నెలకు రూ.3000 ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ప్రధానంగా మతపరంగా అందించే సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ నిర్ణయించారు. దీని ప్రకారం మదర్సాలకు అందించే సాయం ఆగిపోయా అవకాశం ఉంది. అదే సమయంలో సిఏఏ చట్టం కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తామని బెంగాల్ మంత్రి అగ్ని మిత్ర పాల్ ప్రకటించారు.
వేతన సవరణకు సంఘం…
ఇప్పటికే బెంగాల్లో లక్ష్మీ భండార్ పథకం అమలు అవుతుంది. ఈ పథకం లబ్ధిదారులు ఎటువంటి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా.. నేరుగా అన్నపూర్ణ పథకానికి అర్హత పొందేలా చూస్తారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్ కూడా ప్రారంభిస్తారు. అయితే ప్రధానంగా ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పొందేందుకుగాను కొత్త ప్రభుత్వం వేతన సవరణకు సంబంధించిన సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓబీసీలకు అందించే పథకాల అమలుకు కొత్త కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు.
త్వరలో ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. కేంద్రంతో కలిసి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఇటీవల కొత్త ముఖ్యమంత్రి సువెందు అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే మమతా బెనర్జీ మార్కు పథకాలకు బ్రేక్ ఇస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం విశేషం.