క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లో వరుస దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్లను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా వేటాడుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటన మరవక ముందే, తాజాగా జవహర్నగర్లో ప్రొఫెసర్ దంపతులను కట్టేసి దోచుకున్న ఉదంతాలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.
ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజాను నేపాలీ పనిమనిషి కల్పన, ఆమె అనుచరులు దారుణంగా హత్య చేసి బంగారంతో పారిపోయారు. తాజాగా కౌకూరులో ప్రొఫెసర్ మురళీమోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో నమ్మకంగా పుట్టినరోజు వేడుకలు జరిపి, ఆపై వారిని కట్టేసి, మత్తు మందు ఇచ్చి 60 తులాల బంగారం, వెండి, నగదును నేపాలీ ముఠా దోచుకుంది.
జూబ్లీహిల్స్ కేసు కోసం 10 బృందాలు, జవహర్నగర్ కేసు దర్యాప్తు కోసం మల్కాజ్గిరి సీపీ సుమతి ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. సిసిటివి (CCTV) కెమెరాల ఆధారంగా నిందితులు జూబ్లీహిల్స్ నుండి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లినట్లు గుర్తించారు. వీరు పుణె, దిల్లీ మీదుగా నేపాల్ పారిపోయే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నేపాలీ దంపతులను పనిలోకి కుదిర్చిన మహిళను, దళారులను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. గృహ యజమానులకు పోలీసుల కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ నగరవాసులకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. నేపాలీలను పని మనుషులుగా పెట్టుకునే వారు వారి ఆధార్, ఫోన్ నెంబర్లు, ఫోటోలు, ఎవరి ద్వారా వచ్చారనే వివరాలు సేకరించాలి.
సేకరించిన పనివారి వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలి. నగరంలో ఇప్పటికే పని చేస్తున్న నేపాలీ పనివాళ్లను పిలిపించి, నేరాలకు సహకరిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇళ్లలో కొత్తవారిని చేర్చుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.