-
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించండి
-
సుప్రీంలో పిల్ దాఖలు చేసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్
న్యూఢిల్లీ, క్రైమ్మిర్రర్: ప్రభుత్వ నిర్వహణలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, సేవాదార్లు, ఉద్యోగులకు కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వీరి వేతనాలు, పని ప్రదేశంలో పరిస్థితులపై సమీక్ష కోసం జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని నియమించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ కోర్టును కోరారు.
వేతనాల కోడ్-2019లోని సెక్షన్ 2(కే) ప్రకారం పూజారులు, ఆలయాల సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ప్రస్తుతం వీరికి ‘దక్షిణ, గౌరవ భృతి’ పేరుతో నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 మాత్రమే ఇస్తున్నారని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని తెలిపారు. వీరికి పెన్షన్లు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కూడా లేదని చెప్పారు.
వీరికి గౌరవప్రదమైన వేతనాలను ఇవ్వ నిరాకరించటం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21, 38, 39, 43లను ఉల్లంఘించటమేనని వాదించారు. పూజారులు, ఆలయాల ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని అలహాబాద్, మద్రాస్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులు గతంలో సూచించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తుచేశారు.