Barrier-Less Toll System Launched: దేశంలో టోల్ వసూలు విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని సూరత్–భరుచ్ జాతీయ రహదారిపై ఉన్న చౌరాసి టోల్ప్లాజా వద్ద కొత్తగా బారియర్లెస్ టోల్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. దేశంలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేదు!
ఈ ఆధునిక టోల్ విధానంలో వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా టోల్ గేట్ల వద్ద బారియర్లు ఉండటంతో వాహనాలు ఆగి చెల్లింపులు చేసి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొత్త విధానంలో అలాంటి బారియర్లు ఉండవు. వాహనం వేగాన్ని తగ్గించకుండా సూటిగా వెళ్లిపోతూ టోల్ చెల్లించవచ్చు.
కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే?
ఈ వ్యవస్థలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు (ANPR) టెక్నాలజీతో పాటు ఫాస్టాగ్ సదుపాయం కలిపి ఉపయోగిస్తారు. వాహనం టోల్ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే దాని నంబర్ ప్లేట్ స్కాన్ అవుతుంది. అదే సమయంలో ఫాస్టాగ్ ద్వారా సంబంధిత ఖాతా నుంచి టోల్ చార్జీలు స్వయంచాలకంగా కట్ అవుతాయి. దీంతో డ్రైవర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగుతుంది.
ట్రాఫిక్ సమస్యకు చెక్!
ఈ కొత్త విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇంధన వినియోగం, సమయం రెండూ ఆదా అవుతాయి. వాహనాలు నిలిచే అవసరం లేకపోవడంతో కాలుష్యం కూడా కొంతవరకు తగ్గుతుంది. భారత టోల్ సిస్టమ్లో ఇది ఒక కీలక అడుగు అని మంత్రి గడ్కరి వెల్లడించారు. భవిష్యత్తులో ఈ విధానాన్ని మరిన్ని జాతీయ రహదారులపై అమలు చేసే అవకాశం ఉందన్నారు.