తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా సినిమా జన నాయగన్ విడుదలకు ముందే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సినిమా మొదటి నుంచి మంచి అంచనాలు సృష్టించుకున్నప్పటికీ…ఇప్పుడది అనుకోని ఇబ్బందుల్లో పడింది.
-
విడుదలకు ముందే లీక్..!
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు, ఒక పాట ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చిత్రబృందం ఒక్కసారిగా షాక్కు గురైంది. లీక్ అయిన కంటెంట్ను వెంటనే తొలగించేందుకు టీమ్ ప్రయత్నిస్తోంది. ఇంకా, ఈ లీక్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు సహాయం తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఇప్పటికే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి ముఖ్య కారణం తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు. ఎన్నికల సమయంలో సినిమా రిలీజ్ చేయడం సరిగ్గా ఉండదని భావించిన మేకర్స్, రిలీజ్ను వాయిదా వేశారు. మరోవైపు, సెన్సార్ ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అయింది. సినిమా చూసినా..ఇంకా ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది.
-
మరో సమస్య కూడా..!
ఈ ఆలస్యంతో పాటు, జన నాయకన్ ఓటీటీ డీల్ రద్దయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా చిత్రబృందం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్తో ఒప్పందం కుదరలేదని వారు తెలిపారు. రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోవడంతో డిజిటల్ రిలీజ్ ప్లాన్లు కూడా ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. థియేటర్ రిలీజ్కు దగ్గరగా వచ్చాకే ఓటీటీ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా, మమిత, బాబి డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
ముఖ్యంగా, ఇది విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. అందుకే అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు. సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఇప్పుడీ లీక్ సమస్యతో పాటు ఇతర అడ్డంకులు కూడా రావడంతో, జన నాయకన్ టీమ్పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ, ఈ సినిమాను మంచి విధంగా విడుదల చేసి, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు.
