* వైష్ణవ సెంటిమెంట్ తో గులాబీ.. శైవ క్షేత్రాల అభివృద్ధితో రేవంత్
* సరికొత్త సెంటిమెంటు అస్త్రంతో తెలంగాణ నేతలు
* హిందుత్వ బిజెపికి కాస్త ఇబ్బందికరమే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భక్తి ఫైట్ కొనసాగుతోంది. వైష్ణవ గులాబీ వెర్సెస్ సైవహస్తం అన్నట్టు పరిస్థితి మారింది. వైష్ణవ దేవాలయాలకు కెసిఆర్ పెద్దపీట వేస్తే.. శివాలయాలకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కెసిఆర్ వదిలేసిన వాటికి సైతం రేవంత్ నిధులు సమకూరుస్తున్నారు. ఇలా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతుండడంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. కెసిఆర్ యాదాద్రి లో నరసింహ స్వామిని కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి భారీ కోవెల కట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ శివాలయం నిర్మాణానికి పూనుకోవడం చూస్తుంటే పక్కా పొలిటికల్ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భక్తి సెంటిమెంట్ పతాక స్థాయికి చేరడం విశేషం.
విష్ణు ఆలయాలకు ప్రాధాన్యం..
గులాబీ బాస్ కెసిఆర్ కు భక్తి భావం ఎక్కువ. తరచూ యజ్ఞాలతో పాటు యాగాలు చేస్తుంటారు. చిన్న జీయర్ స్వామి సూచనలతో ఆగమశాస్త్రాల లెక్కలతో విష్ణు ఆలయాలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో భద్రాచలం రామాలయాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు. దానిని రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోవడం ప్రారంభించారు. భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శివాలయాల నిర్మాణం పై దృష్టిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనను తాను శివ భక్తుడిని అని చెప్పుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అదే లైన్ తీసుకున్నారు. తెలంగాణలో వేములవాడ రాజన్న ఎంతో ప్రాముఖ్యం. అటువంటి ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారు కెసిఆర్. కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే సీఎం రేవంత్ బాధ్యతలు చేపట్టాక ఆ నిధులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు మూసి గట్టున 100 అడుగుల శివుడిని నిలబెడతాను అంటూ తేల్చి చెబుతున్నారు.
ఆ రెండింటి మధ్య బిజెపి..
తెలంగాణ రాజకీయాలను దేవుళ్ల మధ్య పోటీగా పెట్టేశారు రేవంత్ తో పాటు కేసీఆర్. అయితే కెసిఆర్ మార్కు భారీ గోపురాలు, శిల్ప కళలు, వైష్ణవ ఆడంబరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఉంటుంది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. శివ భక్తితో పాటు సైవక్షేత్రాల అభివృద్ధి, జై భోలో అన్న నినాదాలను అందుకున్నారు రేవంత్. ఇప్పటికే తెలంగాణలో హిందుత్వవాదంతో ముందుకు వెళ్తోంది బిజెపి. కానీ తమ రాజకీయ వైరి పక్షాలు భక్తి అనే సెంటిమెంటును ప్రదర్శిస్తుండడం కాషాయ దళానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు సమీపించే కొలది తెలంగాణ పాలిటిక్స్ లో భక్తి అనే అంశం మరింత పని చేయనుంది అన్నమాట.
