Homeతెలంగాణపసిపిల్లల కోసం 'తొలి ముద్ద' పథకానికి శ్రీకారం..!

పసిపిల్లల కోసం ‘తొలి ముద్ద’ పథకానికి శ్రీకారం..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ అనే అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పడటం పథకం యొక్క లక్ష్యం అన్నారు. ఈ పథకం కింద చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి ‘రెడీ టూ కుక్’ (ready-to-cook) ఆహార పదార్థాలను అల్పాహారంగా అందిస్తారు.

రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు మరియు ఇతర విధుల కోసం అంగన్‌వాడీ టీచర్లకు ఈ సందర్భంగా కొత్త మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.

పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపైనే ఉందని సీఎం స్పష్టం చేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో ఆహార భద్రత ఉన్నప్పటికీ, పౌష్టికాహార లోపం ఒక పెద్ద సవాలుగా మారిందని, అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచే పోషకాహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments