ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: సౌది అరేబియాలోని అమెరికా ఎయిర్ బేస్పై ఈ రోజు తెల్లవారు జామున డ్రోన్లతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. కాగా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడులకు పాల్పడ్డట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతకారమన్నంటు సౌది అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్కు మద్దతున్న గ్రూపులే దాడులకు తెగబడ్డట్టు తెలుస్తుంది.
ఈ దాడిలో రెండు ‘వన్-వే అటాక్’ డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం. మొదటి డ్రోన్ ఎయిర్ బేస్లోని నివాస సముదాయం సమీపంలో పేలిపోయింది. దీంతో అక్కడి భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండవ డ్రోన్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా గాలిలోనే ధ్వంసం చేసినప్పటికీ, దాని శిథిలాలు పడటం వల్ల అమెరికా సేవా సభ్యులు గాయాలపాలయ్యారు. గాయపడిన 10 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి ప్రస్తుతం బేస్లోని మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
అమెరికా, సౌదీ స్పందన…
ఈ దాడిని అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. అమెరికా బలగాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ‘ మా దళాలపై జరిగే ఇటువంటి దాడులను మేము ఉపేక్షించం. తగిన సమయంలో, తగిన రీతిలో సమాధానం చెప్తాం’. అని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మిత్రదేశాల బలగాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
