Lady Cop Kills Father for Love Marriage: మహారాష్ట్రలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా నిలిచాడనే కారణంతో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ తన కన్నతండ్రినే హత్య చేసింది. ఈ విషయం మూడు సంవత్సరాల తర్వాత బయటపడింది. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 ఏప్రిల్ 25న జయంత్ బల్లవర్ అనే పోలీస్ అధికారి డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన కూతురు ఆర్య ఆయనకు మిల్క్ షేక్ ఇచ్చింది. అది తాగిన తర్వాత జయంత్ తన పనికి వెళ్లారు. అయితే కొద్దిసేపటికే చంద్రపూర్ లోని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. అప్పట్లో ఇది సహజ మరణంగా భావించి కేసును పోలీసులు ముగించారు.
మూడు సంవత్సరాల తర్వాత మలుపు తిరిగిన కేసు
మూడు సంవత్సరాల తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆర్య భర్త ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, జయంత్ మరణం సహజం కాదని, హత్యేనని వెల్లడించాడు. అతని వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మళ్లీ విచారణ ప్రారంభించారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆర్య, ఆశిష్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి ఆర్య తండ్రి జయంత్ ఒప్పుకోలేదు. దీంతో ఆయనను అడ్డుతొలగించాలని ఆర్య, ఆశిష్ ప్లాన్ చేసినట్లు తేలింది. ఆర్య తన కజిన్ చైతన్య సహాయంతో విషం తెప్పించి, అదే మిల్క్షేక్లో కలిపి తండ్రికి ఇచ్చింది. ఆ విషం కారణంగానే జయంత్ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.తర్వాత ఆర్య, ఆశిష్ పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ గొడవలు జరుగుతుండగా, చివరకు ఆశిష్ పోలీసులకు నిజం చెప్పడంతో ఈ కేసు బయటపడింది.
ఆర్య, ఆశిష్, చైతన్య అరెస్ట్
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆర్య, ఆశిష్, చైతన్యలను అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దారుణానికి దిగజారవచ్చో చూపించే ఈ సంఘటన అందరినీ షాక్కు గురిచేస్తోంది.
