అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాత చెరువు గ్రామానికి చెందిన బోయ సుకన్య, బోయ హనుమంతు దంపతులు తమ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు సందీప్, ఒక కుమార్తె అమృత ఉన్నారు. హనుమంతు గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కుటుంబంలో గత కొంతకాలంగా కలహాలు కొనసాగుతున్నాయి. భార్య సుకన్యకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.
ఈ వివాదాల మధ్య నాలుగు నెలల క్రితం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్త హనుమంతును భార్య సుకన్య రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అనంతరం ఎవరికి తెలియకుండా శవాన్ని ఇంటి ప్రాంగణంలోనే గుంట తవ్వి పూడ్చిపెట్టింది. ఈ విషయం బయటకు చెప్పితే ప్రాణహాని కలుగుతుందని తన కుమార్తె అమృతను సుకన్య బెదిరించినట్లు సమాచారం. దీంతో అమృత 4 నెలల పాటు భయంతో మౌనం పాటించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెలుగులోకి రావడానికి కుటుంబంలో జరిగిన మరో వివాదమే కారణమైంది. ఇటీవల కుమార్తె అమృత ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనగా, తల్లి సుకన్య ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయంపై తల్లి, కూతుళ్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలోనే అమృత తన తండ్రి హనుమంతును తల్లి హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిందని బంధువులకు, పోలీసులకు వెల్లడించింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విషయం బయటపడిన వెంటనే నిందితురాలు సుకన్య స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. నాలుగు నెలలుగా హనుమంతు వేరే మహిళతో వెళ్లిపోయాడని బంధువులను నమ్మిస్తూ మాయమాటలు చెప్పినట్లు కూడా విచారణలో తేలింది. ఈ ఘటన బయటపడటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించి శవాన్ని వెలికితీసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
