అసెంబ్లీ సమావేశాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తన ప్రత్యేక శైలిలో ప్రసంగించి సభలో నవ్వులు పూయించారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన.. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని గట్టిగా ప్రస్తావిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువచ్చారు. నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్తతో ఆ ప్రాంతం పూర్తిగా బాధాకర పరిస్థితిలో ఉందని, అక్కడ నివసించే ప్రజలు రోజూ అసహ్యకర వాతావరణంలో జీవించాల్సి వస్తోందని తెలిపారు. చెత్త నుంచి వస్తున్న దుర్వాసనను భరించడం చాలా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాను మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నాననే భావన కలుగుతోందని సభలో వ్యాఖ్యానిస్తూ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు జవహర్నగర్ ప్రాంతాన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “శ్రీధరన్న.. నన్ను జర పగ బట్టకే.. మా జిల్లాకు మీరు బాధ్యత వహిస్తున్నారుగా, మా సమస్యలను తప్పకుండా పరిష్కరించాలి” అంటూ చమత్కారంగా మాట్లాడారు. జవహర్నగర్ సమస్యను త్వరగా పరిష్కరించడమే కాకుండా, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తంగా తన ప్రసంగంలో సమస్యలను స్పష్టంగా వివరించడంతో పాటు, తన హాస్య శైలితో సభను ఆకట్టుకోవడంలో మల్లారెడ్డి మరోసారి విజయవంతమయ్యారు.
ALSO READ: ఓరి దేవుడో!.. ఏనుగులు పగబడతాయా?
