Monday, March 23, 2026
Homeక్రైమ్Rohit Reddy Farmhouse: రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ సీజ్‌.. డ్రగ్స్ కేసుతో అధికారుల నిర్ణయం!

Rohit Reddy Farmhouse: రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ సీజ్‌.. డ్రగ్స్ కేసుతో అధికారుల నిర్ణయం!

* అసైన్డ్ భూమిలో ఫాంహౌస్ నిర్మాణం

* డ్రగ్స్‌ సప్లయర్‌ అభిషేక్‌ సింగ్‌ అరెస్ట్‌!

* పలుమార్లు డ్రగ్స్‌ సరఫరా చేసిన అభిషేక్

* సిట్ అధికారుల విచారణలో వెల్లడి

మొయినాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహించిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్‌ రెవెన్యూ అధికారులు సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఈ ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి రోహిత్ రెడ్డితోపాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్  కుమార్ తదితరులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకుగాను ప్రభుత్వం నిర్వహించిన సిట్ బృందం దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడినట్లు సమాచారం. రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకోవడం ఇదే మొదటిసారి కాదని,  గతంలోనూ చాలాసార్లు  ఇలాంటి పార్టీలు జరిగాయని పోలీసులు  గుర్తించినట్లు  తెలిసింది. గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్ కు కూడా ఇదే ఫాంహౌస్ వేదికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీలో 11 మంది నిందితులు పట్టుబడటంతోపాటు పోలీసులపైకి తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. దీంతో  రోహిత్ రెడ్డి ఫాంహౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. పైగా ఈ ఫాంహౌస్ నిర్మాణం అసైన్డ్ భూమిలో జరిపారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని దశాబ్ధాల క్రితం ఓ వ్యక్తికి అసైన్డ్ భూమిని ఇవ్వగా.. ఆయన నుంచి రోహిత్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిని కొనుగోలు చేసి ఫాంహౌస్ కట్టారని అంటున్నారు.

పోలీసుల అదుపులో అభిషేక్ సింగ్

మొయినాబాద్ ఫాంహౌస్ లో పట్టుబడ్డ నిందితులకు డ్రగ్స్‌ సరఫరా చేసిన సప్లయర్‌ అభిషేక్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్‌ రవి.. డ్రగ్స్‌ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు ఇంతకుముందు చెప్పాడు. అయితే తరువాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోనే అభిషేక్‌ సింగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడింది. డ్రగ్స్‌ పార్టీ జరిగిన రోజు రోహితరెడ్డి డ్రైవర్‌ శరత్ ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో అభిషేక్‌ సింగ్‌ను కలిసి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తేలింది. ఇప్పటికి 24 సార్లు రోహితరెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిట్‌తోపాటు ఎస్‌వోటీ బృందం కూడా అభిషేక్‌ సింగ్‌ నుంచి సమాచారం రాబడుతున్నట్లు, ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని టీమ్‌లు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. కాల్పులు, డ్రగ్స్‌ కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రోహితరెడ్డితోపాటు రితీశ్ రెడ్డి, నమిత శర్మల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషనపై ఉప్పరిపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషనపై గత బుధవారం వాదనలు జరగగా.. తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments