దేశంలో వంటగ్యాస్ సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నాచురల్ గ్యాస్ సదుపాయం ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లను తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, పీఎన్జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ కోసం బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాకుండా, పైప్డ్ గ్యాస్ సదుపాయం ఉన్న వారు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది.
నిబంధనల ప్రకారం.. ఇప్పటికే పీఎన్జీ వాడుతున్న వినియోగదారులు తమ వద్ద ఉన్న ఎల్పీజీ కనెక్షన్ను స్వచ్ఛందంగా సంబంధిత డిస్ట్రిబ్యూటర్ వద్ద సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్య ద్వారా ఎల్పీజీ వినియోగాన్ని అవసరమైన ప్రాంతాలకు మళ్లించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇంధన దిగుమతుల్లో అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంగా భారత్కు ఎల్పీజీ సరఫరా తగ్గిపోయినప్పటికీ, దేశీయంగా డిమాండ్ మాత్రం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లపై డిమాండ్ సుమారు 60 శాతం వరకు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు ముందస్తుగా బుకింగ్లు చేసుకోవడం కూడా పంపిణీ వ్యవస్థపై అదనపు భారం పెంచుతోంది. ఈ నేపథ్యంలో, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పీఎన్జీ సదుపాయం ఉన్న కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని తగ్గిస్తే, ఆ సిలిండర్లను గ్రామీణ, దూర ప్రాంతాలకు మళ్లించడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రత్యేకంగా పీఎన్జీ నెట్వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని పెట్రోలియం శాఖ పేర్కొంది. పట్టణ ప్రాంతాల ప్రజలు సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కొరత సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: రీల్స్ కోసం తన తండ్రిని పార్శిల్ కట్టి కొరియర్ చేసిన కూతురు
