కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. 5 నుంచి 17 సంవత్సరాల వయస్సులోని పిల్లలకు ఆధార్ కార్డులోని బయోమెట్రిక్స్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం అందిస్తోంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఇప్పటికే చిన్నవయసులో తీసుకున్న ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలు వయస్సు పెరగడం వల్ల మారతాయి. దాంతో 5-17 సంవత్సరాల వయసులోని పిల్లలు తప్పనిసరిగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ఈ సర్వీస్ కోసం ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. సాధారణంగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాలంటే కొంత సర్వీస్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ వయస్సులోని విద్యార్థుల కోసం ఇది పూర్తిగా ఉచితం.
సెప్టెంబర్ తర్వాత ఈ సదుపాయం కోసం చెల్లింపు అవసరం అవుతుంది. 5-17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం అవసరం. లేకపోతే ఆధార్ ఆధారంగా వచ్చే సర్వీసులు ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. ధృవీకరణ సమయంలో బయోమెట్రిక్స్ పని చేయకపోవడం, నిర్ధారిత సేవలను అందుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు సమీప ఆధార్ సెంటర్లకు తీసుకువెళ్లి ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు. సెప్టెంబర్ తర్వాత అదే సేవ కోసం రుసుం చెల్లించాల్సి వస్తుంది.
ఆధార్ సర్వీస్ సెంటర్లకు మాత్రమే కాకుండా, యూఐడీఏఐ దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలలో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రత్యేక శిబిరాల్లో విద్యార్థులు ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ క్యాంపులు ప్రతీ నెల మొదటి వారంలో నిర్వహించబడుతున్నాయి. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు ద్వారా కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలామంది విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయించుకోలేదు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి యూఐడీఏఐ ఉచిత సదుపాయాన్ని అందించింది. అలాగే, దేశంలోని ఆధార్ సర్వీస్ సెంటర్లను సులభంగా గుర్తించేందుకు, వాటి లొకేషన్, అందుబాటులోని సేవలను ముందుగా తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్తో కేంద్రం ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రజలు సెంటర్ వెళ్తే, ఎక్కడ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి అనేది ముందే తెలుసుకోవచ్చు.
ALSO READ: చీమ కుడితే ప్రాణం పోతుందా?
