అస్సాం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మూడోసారి వరుసగా అధికారాన్ని దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుండగా, ప్రతిపక్షాలు కూడా సమానంగా వ్యూహాలు రచిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2016లో బీజేపీ 60 స్థానాలు గెలుచుకోగా, 2021లో కూడా అదే సంఖ్యను నిలబెట్టుకుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటకపోయినా కూటమి బలంతో అధికారాన్ని చేపట్టడం ఆ పార్టీ ప్రత్యేకతగా నిలిచింది. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2016లో 13 స్థానాలు గెలిచి, 2021లో 16 స్థానాలకు చేరుకుంది. అలాగే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా 13 నుంచి 16 స్థానాలకు పెరిగింది. అసోం గణ పరిషత్ మాత్రం 2016లో 14 స్థానాల నుంచి 2021లో 9 స్థానాలకు పడిపోయింది. ఈ గణాంకాల నేపథ్యంలో ఈసారి బీజేపీ 60 మార్క్ దాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అస్సాంలో బీజేపీ బలం గట్టిగానే కనిపిస్తోంది. స్థానిక స్థాయిలో బలమైన కేడర్, కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు ఆ పార్టీకి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ, హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమతూకంగా కొనసాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాలు, అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలు బీజేపీకి ప్లస్గా మారుతున్నాయి. అయితే పదేళ్ల పాలనపై కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుండటం ఆ పార్టీకి సవాల్గా మారే అవకాశం ఉంది. జాతి, సాంస్కృతిక అంశాలు కొందరు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక కొత్త సమీకరణాల దృష్ట్యా మహిళలు, విద్యార్థులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే పథకాలు బీజేపీకి కొంత మద్దతు పెంచే అవకాశం ఉంది. అస్సాం గుర్తింపును కాపాడే శక్తిగా ఎన్డీయే కూటమిని ప్రజల్లో నిలబెట్టడంలో హిమంత బిశ్వ శర్మ విజయవంతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కూటమిలో సీట్ల పంపకాలు కీలక అంశంగా మారాయి. భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తితే, అవి బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యూహాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా మైనార్టీలు, టీ తోటల కార్మికులను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చుతాయా లేదా అన్నది ఇంకా స్పష్టత లేనిదే ఉంది.
అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాత్ర కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోయర్ అస్సాంలో ముస్లిం మైనార్టీలపై ఆ పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ, ఒకే వర్గానికి పరిమితమనే భావన విస్తరణకు అడ్డంకిగా మారుతోంది. అయినప్పటికీ హంగ్ పరిస్థితి వస్తే ఈ పార్టీ కింగ్ మేకర్గా మారే అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.
మొత్తానికి అస్సాం రాజకీయాలు ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారాయి. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా? లేక హంగ్ పరిస్థితి ఏర్పడి కొత్త సమీకరణాలు వెలుగులోకి వస్తాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అస్సాం ప్రజల తుది తీర్పు మే 4న వెలువడనుండగా, రాష్ట్ర భవిష్యత్ రాజకీయ దిశను అదే నిర్ణయించనుంది.
ALSO READ: గ్యాస్ కష్టాలు చెక్.. భారత్ చేరిన రెండు నౌకల నుంచి LPG తరలింపు
