ఉత్తరప్రదేశ్లో ఆశ్చర్యానికి గురిచేసే ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయి పెళ్లి రోజున ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో గ్రామంలో కలకలం రేగింది. ఒకే పెళ్లికూతురిని పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వరులు తమ తమ బరాత్ లతో ఆమె ఇంటికి రావడంతో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జోక్యం చేసుకోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది.
అసలు ఏం జరిగిందంటే?
షామ్లీ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి ముజఫర్నగర్ జిల్లాకు చెందిన ఒక బాలికతో పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉండటంతో వరుడి కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం బరాత్తో పెళ్లికూతురు ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వారికి అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. మీరట్ ప్రాంతానికి చెందిన మరో యువకుడి కుటుంబం కూడా అదే బాలికతో పెళ్లి జరగబోతుందని చెప్పుకుంటూ బరాత్తో అక్కడికి వచ్చింది. దీంతో రెండు కుటుంబాలు తమ అబ్బాయితోనే పెళ్లి ఫిక్స్ అయిందని వాదించడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. గ్రామస్థులు మధ్యవర్తిత్వం చేసి గొడవను ఆపే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వాగ్వాదం మరింత తీవ్రరూపం దాల్చడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఎంట్రీతో..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు కుటుంబాలను శాంతింపజేశారు. విచారణలో పెళ్లికూతురు మైనర్ అని బయటపడటంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు బాలిక వయస్సును ధ్రువీకరించి, వెంటనే ఆమెను రక్షణ కోసం వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఒకే పెళ్లికూతురి కోసం ఇద్దరు వరులు రావడం మాత్రమే కాకుండా, ఆమె మైనర్ కావడం వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
