ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కోర్టు తీర్పు పెద్ద చర్చకు దారి తీసింది. నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం పొందుతున్న ఓ మహిళకు, ఆమె భర్త నుంచి భారీ మొత్తంలో భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన పుణెలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులే. వివాహం జరిగిన ఆరు నెలలకే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. భర్త నెలకు సుమారు రూ.2.79 లక్షలు సంపాదిస్తుండగా, భార్య జీతం కూడా రూ.1.41 లక్షలకు పైగానే ఉంది. భర్త తన తల్లిదండ్రుల బాధ్యతలు కూడా చూసుకుంటున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా మహిళ తరఫు న్యాయవాదులు ఆసక్తికరమైన వాదనను కోర్టు ముందుంచారు. పెళ్లి తర్వాత తాను అనుభవించిన జీవన ప్రమాణాన్ని విడాకుల అనంతరం కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నప్పటికీ భరణం అవసరమేనన్నారు. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, భర్త తన ఆదాయంలో సగం మేరకు భరణం చెల్లించాలని నిర్ణయించింది.
నెలకు రూ. 1.35 లక్షల భరణం
దీంతో భర్త ప్రతి నెలా సుమారు రూ.1.35 లక్షలు భరణంగా చెల్లించాలి. అంతేకాదు, ఈ మొత్తం వ్యక్తిగత ఖర్చుల కిందకు వస్తుందని, దానిపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభించదని చర్చ సాగుతోంది. అంటే భరణం చెల్లించినప్పటికీ అతను తన పూర్తి జీతంపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
సోషల్ మీడియాలో దుమారం
ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇప్పటికే మంచి జీతం పొందుతున్న వ్యక్తికి ఇంత భారీ మొత్తంలో భరణం ఇవ్వడం న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయ నిపుణులు, సామాన్య ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది.