కన్నడ టెలివిజన్ రంగంలో గుర్తింపు పొందిన నటి వనిత తాజాగా మోసాల కేసులో అరెస్టయ్యారు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం కన్నడ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం, వనిత సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని ఆర్థికంగా బలమైన వ్యక్తులను టార్గెట్ చేసేది. మొదట స్నేహం పెంచుకుని, విశ్వాసం సంపాదించిన తర్వాత తనకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైందని చెప్పేది. ముఖ్యంగా బంగారం తాకట్టులో ఉందని, దాన్ని విడిపించేందుకు సహాయం చేయాలని బాధితులను నమ్మించేది.
మూడు రోజులలో డబ్బు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చి నగదు రూపంలోనే డబ్బులు తీసుకునేదని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశాలను ఎంచుకుని లావాదేవీలు జరిపి, ఆ తర్వాత ఫోన్లు ఎత్తకుండా తప్పించుకునే పద్ధతిని అనుసరించిందని తెలిపారు. ఈ తరహాలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది. దర్యాప్తు సమయంలో వనితపై గోవిందరాజనగర్, జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లు బయటపడింది.
తాజాగా ఆమెను కోర్టులో హాజరుపరచగా, కోర్టు కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశముందని భావిస్తున్న పోలీసులు, మోసపోయిన వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియా పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరమని పోలీసులు సూచిస్తున్నారు.