తెలంగాణ

గాంధీలో పని చేయని ఎక్స్ రే యంత్రాలు.. రోగులకు వైద్యం బంద్!

తెలంగాణ వైద్యశాఖ పనితీరు అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా హాస్పిటల్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని.. రోగులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా హాస్పిటల్స్ లో మందులు అందుబాటులో ఉండటం లేదు. జిల్లా హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి. ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లోనూ రోగులను పట్టించుకునే వారు లేరనే ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆరు నెలలుగా ఎక్స్-రే యంత్రాలు పని చేయడం లేదని తెలుస్తోంది. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. డబ్బులు లేని నిరుపేదలు ఆస్పత్రిలోనే ఎక్స్-రే తీయించుకోవాలనుకుంటే రెండు, మూడు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది.

దీంతో హైదరాబాద్లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ ల్లో గాంధీకి వస్తుంటారు.. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్స్‌రేలు తీయడం ఇబ్బందిగా మారుతోంది. ఆరు నెలలుగా యంత్రాలు పనిచేయకపోయినా.. పట్టించుకోకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Back to top button