నీట్ పునఃపరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాలు, పేపర్ లీక్ ఆరోపణలు, రీ టెస్ట్ ప్రకటనల కారణంగా పలువురు విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో ఇద్దరు నీట్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచింది. వైద్య, విద్య లక్ష్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతలో నెలకొంటున్న ఆందోళన, భయం, అనిశ్చితి ఇప్పుడు కుటుంబాలను కూడా కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ ఘటనలు విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థి జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షకు హాజరుకావాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అహ్మదాబాద్లోని త్రగడా ప్రాంతంలోని ఆరిస్టో ఆనందం అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆ విద్యార్థి జూన్ 18 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.55 గంటల సమయంలో తాను ఉంటున్న 6వ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పరీక్షల ఒత్తిడి యువతపై ఎంతటి ప్రభావం చూపుతోందో మరోసారి స్పష్టమైంది.
ఇదే సమయంలో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 19 ఏళ్ల అనున్కీర్తన అనే విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసిన ఆమె, పేపర్ లీక్ వివాదం తర్వాత మళ్లీ పరీక్షకు హాజరుకావాల్సి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. మరోసారి పరీక్ష రాయాల్సి రావడం వల్ల కలిగిన నిరాశే ఆమె ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఘటన స్థలంలో ఎలాంటి లేఖ లభించకపోవడంతో అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద సంఘటన తమిళనాడులో నీట్ వ్యతిరేక ఉద్యమాలకు మరింత బలం చేకూర్చింది.
అనున్కీర్తన మరణం తర్వాత తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. కోయంబత్తూరు సహా పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. నీట్ పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం నిరంతరం దీనిని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ పరీక్ష కారణంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోతున్నారని, ఖరీదైన శిక్షణా కేంద్రాలకు వెళ్లగలిగే ఆర్థికంగా బలమైన కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. గతంలో 12వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడంతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించాయని తమిళనాడు నేతలు చెబుతున్నారు.
నీట్ నుంచి మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక బిల్లును ఆమోదించినప్పటికీ, రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో ఇప్పటికీ ఆ రాష్ట్రంలో నీట్ అమలులో కొనసాగుతోంది. తాజా ఘటనలతో అత్యంత పోటీతో కూడిన ఈ పరీక్ష విద్యార్థులపై మానసికంగా ఎంతటి భారాన్ని మోపుతోందనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అధికారిక గణాంకాల ప్రకారం నీట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడులో 20 మందికి పైగా అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. ఇక గత 2 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 4 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
NOTE: మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, కౌన్సిలర్లు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం. అవసరమైతే 9999666555, 022-25521111 వంటి హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించి సహాయం పొందవచ్చు.
ALSO READ: అందమైన పల్లెటూరి కథనే”వెంకట్రామయ్య గారి తాలూకా” మూవీ…!