కర్ణాటకలో ఓ స్టాఫ్ నర్స్ హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. భార్య లావుగా ఉందనే కారణంతో ఆమెను భర్త గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఘటన ధారవాడ జిల్లాలో జరిగింది. మృతురాలిని 29 ఏళ్ల ప్రియాంక కమలాకర్గా గుర్తించగా, నిందితుడు ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ అని పోలీసులు తెలిపారు.
ప్రియాంక, బసవరాజ్ల వివాహం 2024 డిసెంబర్లో జరిగింది. అయితే పెళ్లి తర్వాత కొద్దికాలానికే ఆమెకు వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. అదనపు కట్నం, నగదు, బంగారం తీసుకురావాలని భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు తరచూ ఒత్తిడి చేసేవారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కారణంగా ప్రియాంక మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా, ప్రియాంక లావుగా ఉందని భర్త తరచూ అవమానించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. “నువ్వు నాకు నచ్చలేదు”, “నువ్వు పిల్లలకు జన్మనివ్వలేవు” అంటూ దూషించేవాడని వారు చెప్పారు. ఈ మాటలతో పాటు శారీరక దాడులు కూడా చేసేవాడని ఆరోపించారు. వివాహం తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినప్పటికీ, భర్త వేధింపులు, దాడుల కారణంగా రెండుసార్లూ గర్భస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయని తెలిపారు.
సోమవారం రాత్రి ధారవాడ జిల్లాలోని హనసి గ్రామంలోని ఇంట్లో ప్రియాంకను భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే గ్రామంలో ఆగ్రహ వాతావరణం నెలకొంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త బసవరాజ్ వడ్డార్తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ వేధింపులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.