
Israeli Airstrikes: ఇరాన్ పై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగింది. అణు స్థావరాలు, సైనిక కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలను టార్గెట్ చేసి మెరుపు దాడులు చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఏకంగా 200 యుద్ధ విమానాలతో టెహ్రాన్ మీద దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాల్లో కీలకమైన నతాంజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ధ్వంసం అయ్యింది. పదుల సంఖ్యలో రేడార్ కేంద్రాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఎయిర్ మిసైల్ లాంచర్లు సహా పలు నగరాల్లో ఏకంగా 100 టార్గెట్లపై బాంబులు, మిసైల్స్ ప్రయోగించింది.
ఇరాన్ కీలక నాయకులు మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ చీఫ్ హొస్సేన్ సలామీ, ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరీతో పాటు నలుగురు ఆర్మీ జనరల్స్ చనిపోయారు. ఆరుగురు ఆటమిక్ సైంటిస్టులు, ఓ రాజకీయనాయకుడు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ విభాగానికి చెందిన టాప్ లీడర్స్ సమావేశం అయిన అండర్ గ్రౌండ్ కమాండ్ సెటర్ మీద దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో పలువురు కీలక అధికారులు చనిపోయినట్లు తెలిపింది. ఇరాత్ తో యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడులు ఇవే కావడం విశేషం.
ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. తమ దేశంలోని పౌర ప్రాంతాలపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ తన చేతులకు రక్తపు మరకలు అంటించుకుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మండిపడ్డారు. అటు ఈ దాడికి ప్రతిగా ఇరాన్ 100 డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. వీటన్నంటినీ కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. తాము ఎలాంటి డ్రోన్లు ప్రయోగించలేదని తేల్చి చెప్పింది. త్వరలో ప్రతీకార దాడి తప్పదని హెచ్చరించింది.
Read Also: అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్లో నిరసన జ్వాలలు!