భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో మానవత్వాన్ని మరిచిపోయేలా జరిగిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూఢనమ్మకాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతదేహాలను అద్దె ఇంట్లోకి అనుమతించకుండా ఇంటి యజమాని అడ్డుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెంకటేశ్వర కాలనీలో చోటుచేసుకోగా, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
చర్ల మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దూడల శ్రీనివాస్ భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో కుటుంబంతో నివసించేవారు. అయితే నాలుగు నెలల క్రితం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోకముందే మరో ఘోర ప్రమాదం వారిని కుదిపేసింది. ఈ నెల 21న ములకలపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు సాయి ప్రకాష్, కోడలు సంధ్య, మనవడు మోక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం అంబులెన్స్లో వెంకటేశ్వర కాలనీలోని వారి అద్దె ఇంటికి తీసుకువచ్చారు. అయితే మృతదేహాలను ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని సాంబశివరావు గేటుకు తాళం వేసి అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్థానికులు, బంధువులు ఎంతగా నచ్చజెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వరుసగా అదే ఇంట్లో నివసించిన కుటుంబ సభ్యులు మరణించడంతో ఆ ఇంటికి కీడు జరిగిందనే మూఢనమ్మకంతో మృతదేహాలను లోపలికి అనుమతించలేనని మొండిగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో చివరకు మృతురాలు సంధ్య పుట్టినిల్లు ఉన్న పురుషోత్తమపట్నం గ్రామ సమీపానికి మూడు మృతదేహాలను తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబం ఎదుర్కొన్న వరుస విషాదాల మధ్య ఇలాంటి అవమానకర పరిస్థితి ఎదురుకావడం స్థానికులను కలచివేసింది.
ఇంటి యజమాని ప్రవర్తనపై ప్రజాసంఘాలు, స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకుడు బాలనర్సారెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విషాదకర సందర్భాల్లో మానవత్వం, సహానుభూతి చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. మూఢనమ్మకాలకు లోనై బాధలో ఉన్న కుటుంబాన్ని మరింత కృంగదీసేలా వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు మూఢనమ్మకాలను వీడి మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ALSO READ: ప్రేయసితో ఏడడుగులు నడిచిన షణ్ముఖ్ జస్వంత్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!