నెల్లూరు, క్రైమ్మిర్రర్: ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం మరో భారీ కానుకను అందించింది. నెల్లూరు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వీలుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. మైసూర్ తర్వాత దక్షిణ భారతదేశంలోనే రెండవ ఆర్ఐఈ క్యాంపస్గా నెల్లూరు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రపంచస్థాయి క్యాంపస్ను నెల్లూరులో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 234.36 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది.
Also Read:ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగేటప్పుడు జాగ్రత్త..!
ఈ అత్యాధునిక క్యాంపస్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ తరగతి గదులు, పరిశోధనా కేంద్రాలు , అత్యాధునిక లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్తో పాటు విద్యార్థులు, అధ్యాపకులకు అవసరమైన హాస్టల్, వసతి గృహాల సముదాయాలను నిర్మించనున్నారు. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ క్యాంపస్ నమూనాతో ఈ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు.ఎన్సీఈఆర్టీ పరిధిలో పనిచేసే ఈ నెల్లూరు ఆర్ఐఈ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల విద్యా అవసరాలను తీర్చనుంది. దక్షిణ భారతదేశంలోనే ఉపాధ్యాయ విద్య , అధ్యాపక శిక్షణ, విద్యా పరిశోధనల్లో ఒక ప్రధాన హబ్గా ఇది అవతరించనుంది.
Also Read:బెంగళూరు Vs హైదరాబాద్.. ఉద్యోగి పోస్ట్తో మళ్లీ హాట్ డిబేట్!
జాతీయ విద్యా విధానం కు అనుగుణంగా ఇక్కడ బోధనా పద్ధతులపై సరికొత్త పరిశోధనలు జరగనున్నాయి. నూతన తరం ఉపాధ్యాయులను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.గతంలో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవగా..ఇప్పుడు మాస్టర్ ప్లాన్ విడుదల కావడం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశకు చేరడంతో నెల్లూరు ప్రజల్లో , విద్యా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ అనుమతులు రాగానే నిర్మాణ పనులు వేగంగా ప్రారంభం కానున్నాయి.
Also Read:మెటా మెచ్చిన ఇండియన్.. వాట్సాప్ సీఈవోగా కునాల్ షా