క్రైమ్ మిర్రర్ : ఫిలిప్పీన్స్లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బంగా పట్టణంలోని ఒక పాఠశాలలో 16 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ విషాద ఘటనలో నిందితుడు కూడా మరణించినట్లు టౌన్ మేయర్ ఆల్బర్ట్ పాలెన్షియా వెల్లడించారు. అయితే అతడి మృతికి గల పూర్తి వివరాలను అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులంతా 14 నుంచి 17 ఏళ్ల వయస్సు గలవారని మేయర్ తెలిపారు. ప్రయాసపడి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఆ దేశ విద్యాశాఖ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులు భయాందోళనలతో బయటకు పరుగులు తీయడం, తీవ్రంగా గాయపడిన వారిని స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. కాగా, ఫిలిప్పీన్స్లో ఇటీవలి కాలంలో పాఠశాలల్లో కాల్పుల సంస్కృతి పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
గత నెలలోనే ఒక విద్యార్థి క్లాస్రూమ్లోనే సహచర విద్యార్థిని కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణాన్ని అతను సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. జూన్ నెలలో జరిగిన మరో ఘటనలో, ఒక పబ్లిక్ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్లో తుపాకీ లైసెన్సులపై కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, అక్రమ ఆయుధాల విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
also read : గోవిందరావుపేట తహసీల్దార్పై ఏసీబీ ట్రాప్.. రూ.14 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
