క్రైమ్ మిర్రర్ : జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉదంపూర్ జిల్లా మజాల్తా ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపించినట్లు బుధవారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి అనుమానిత ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కొంతసేపు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు, వారి గుర్తింపు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
ఎన్కౌంటర్ అనంతరం కూడా ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు దాక్కుని ఉండే అవకాశాల నేపథ్యంలో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తొలుత జమ్మూకశ్మీర్ పోలీసులు, స్పెషల్ పారాట్రూపర్లు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. కాల్పులు మొదలైన తర్వాత అదనపు బలగాలను అక్కడికి తరలించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, జేకే పోలీస్ ఎస్ఓజీ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్లో పాల్గొన్నారు.
ఇటీవల పిర్ పంజాల్ ప్రాంతంలో లష్కరే తోయిబా అనుబంధ అండర్గ్రౌండ్ నెట్వర్క్ను భద్రతా సంస్థలు గుర్తించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిఘాను మరింత పెంచారు. సెప్టెంబర్ 15న పిర్ పంజాల్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
also read : బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ.. వైరల్ వీడియోతో పోలీసుల దర్యాప్తు
